జైపూర్: ఒక ఒంటె తన యజమానిని చంపింది. దీంతో ఆగ్రహించిన జనం ఆ ఒంటెను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దీంతో ఆ ఒంటె చనిపోయింది. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంచు గ్రామానికి చెందిన సోహన్రామ్ నాయక్కు ఒక ఒంటె ఉన్నది. సోమవారం సాయంత్రం మరో ఒంటెను చూసిన అది తాడు తెంపుకుని పరుగెత్తింది. గమనించిన నాయక్ దాని వెంటపడి పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ ఒంటె, యజమాని నాయక్ను తొలుత కాళ్లతో తన్నింది. కింద పడిన అతడి మెడ, తలను నోటితో పట్టుకుని గట్టిగా కొరికింది. దీంతో యజమాని నాయక్ అక్కడికక్కడే మరణించాడు.
కాగా, నాయక్ కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు దీనిని చూసి షాకయ్యారు. అతికష్టం మీద ఆ ఒంటెను అదుపు చేశారు. అనంతరం దానిని ఒక చెట్టుకు కట్టేశారు. యాజమాని నాయక్ను చంపిందన్న ఆగ్రహంతో అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి కర్రలతో ఆ ఒంటె తలపై పలుమార్లు కొట్టారు. దీంతో దెబ్బలు తాళలేక అది చనిపోయింది. అయితే ఆ ఒంటెకు పిచ్చి పట్టిందని, మానవులకు హానికరంగా మారిందని దానిని చంపిన జనం తమ చర్యను సమర్థించుకున్నారు. మరోవైపు ఒంటెను చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.