జైపూర్: నీట్ రీఎగ్జామ్కు ముందు కొందరు అభ్యర్థులకు వీడియో కాల్స్ వచ్చాయి. లీకైన పేపర్ కోసం రూ.30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక విద్యార్థి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (NEET Paper) రాజస్థాన్లోని అజ్మీర్లో ఈ సంఘటన జరిగింది. శనివారం పలువురు నీట్ అభ్యర్థులకు వీడియో కాల్స్ వచ్చాయి. నీట్ పేపర్ లీకైనట్లు అందులో చూపించారు. రూ.30,000లకే నీట్ పేపర్ అందజేస్తామని వారు చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బు చెల్లించాలని కోరారు.
కాగా, అజ్మీర్లోని డీఏవీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కృష్ణ సింగ్ ఠాకూర్కు ఈ విషయం తెలిసింది. దీంతో అతడు స్వయంగా ఆ వీడియో కాల్ చేసిన అమ్మాయితో మాట్లాడి రికార్డ్ చేశాడు. ఆ తర్వాత దీని గురించి పోలీస్ అధికారికి ఆ స్టూడెంట్ ఫిర్యాదు చేశాడు. క్యూఆర్ కోడ్, ఫోన్ చేసిన వ్యక్తి నంబర్తో సహా డిజిటల్ సాక్ష్యాలను అందజేశాడు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇలాంటి మోసాలకు గురయ్యారని కృష్ణ సింగ్ ఠాకూర్ ఆరోపించాడు. దీనిపై దర్యాప్తు జరుపాలని పోలీస్ అధికారిని కోరాడు.
మరోవైపు ఆ విద్యార్థి ఫిర్యాదుపై అజ్మీర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్కు అనుసంధానమైన మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వీడియో కాల్ సందర్భంగా చూపించిన నీట్ లీక్ పేపర్ ఆరోపణల ప్రామాణికతను నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అజ్మీర్ ఎస్పీ ఉషా యాదవ్ తెలిపారు. పేపర్ లీక్ రాకెట్కు సంబంధించిన వాళ్లా? లేక విద్యార్థులను మోసం చేయడానికి కొత్త వ్యూహమా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని అభ్యర్థులను కోరారు.