న్యూఢిల్లీ, నవంబర్ 6: దేశవ్యాప్తంగా ఏడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. చాలా చోట్ల సిట్టింగ్ పార్టీనే తిరిగి విజయం సాధించింది. అయితే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ గెలుపు జెండా ఎగురవేసింది. బీహార్లోని గోపాల్గంజ్ స్థానంలో బీజేపీ కేవలం 1,794 ఓట్ల మెజార్టీతో గెలిచింది. బీజేపీకి 70,053 ఓట్లు రాగా, ఆర్జేడీకి 68,259 వచ్చాయి.
ఇక్కడ బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చిన ఎంఐఎంకు గణనీయంగా 12,214 ఓట్లు పడ్డాయి. అలాగే బీఎస్పీ అభ్యర్థికి 8,854 ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు పార్టీలు 21 వేల బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాయన్న మాట. మొత్తానికి బీహార్లో బీజేపీ, ఆర్జేడీలు తమ సిట్టింగ్ స్థానాలు గోపాల్గంజ్, మోకామాలను తిరిగి దక్కించుకొన్నాయి. మహారాష్ట్రలోని అంథేరీ ఈస్ట్లో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అభ్యర్థి రుతుజా రమేశ్ లట్కే 65 వేల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో అనూహ్యంగా నోటా 12,806 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఒడిశా
(ధామ్నగర్), ఉత్తరప్రదేశ్ (గోలా గోక్రన్నాథ్)లో బీజేపీ తిరిగి విజయం సాధించగలిగింది. హర్యానాలోని ఆదంపూర్లోనూ బీజేపీ గెలిచింది.