PM Modi : అంతర్జాతీయ పరిణామాల్ని ఎదుర్కొనేందుకు, దేశ ఆర్థిక స్తిరత్వం కోసం ప్రజలు దేశీయ ఉత్పత్తులే కొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, పర్యటనలకు వెళ్లే వారు దేశీయంగానే ప్రయాణించి మన పర్యాటక రంగానికి సహకరించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం, కోవిడ్ తర్వాతి పరిస్థితులు, చమరు సంక్షోభం వంటి కారణాలతో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై వివరించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సహకరించాలన్నారు. ఈ మేరకు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ‘‘సరఫరా రంగంలో అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నందున దీన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు ఐక్యంగా సిద్ధం కావాలి. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులే వాడాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. దేశం, మాతృభూమికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. దేశభక్తి అంటే దేశం కోసం చావడం కాదు. దేశం కోసం బతకడం. మన విధుల్ని మనం నిర్వర్తించడం. ఇంధన వినియోగాన్ని తగ్గిద్దాం. పెట్రోల్, డీజిల్ను జాగ్రత్తగా వాడుకుందాం. ప్రజా రవాణాను వినియోగిద్దాం. వీలైనంతగా ఎలక్ట్రిక్ వాహనాల్ని వాడుదాం. కార్ పూలింగ్ ఎంచుకుందాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని తగ్గించాం.
ఇంధన వినియోగం తగ్గితే విదేశీ మారక నిల్వలు మిగులుతాయి. అలాగే, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకుండా ఉంది. బంగారం దిగుమతులు తగ్గితే, విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి. ప్రస్తుతం మన దేశంలో వంట నూనె కోసం కూడా విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. వంట నూనెల ఉత్పత్తిలో మనం తగిన ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే, దేశంలో రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలి. అనేక అంశాల్లో దేశం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇలాగైతే దేశం అభివృద్ధి సాధించలేదు” అని మోదీ సూచించారు.