ఒకప్పుడు వాహనాల్లో తిరగడం అంటే సరదా. కానీ.. ఇప్పుడు వాహనాల్లో తిరగడం అంటే దూల తీర్చుకోవడమే. అవును.. పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి.. డిజీల్ ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయి. ఈనేపథ్యంలో వాహనాలను బయటికి తీయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు.
అందుకే ఓ వ్యాపారవేత్త వెరైటీగా ఆలోచించి.. తన ఇంట్లో కారు, బైకులు ఉన్నా… ఓ గుర్రాన్ని కొనుక్కున్నాడు. ఏ పని ఉన్నా గుర్రం మీద వెళ్లడమే. గుర్రాన్ని కొనుక్కొని కొత్త పద్ధతిలో దాన్ని ప్రయాణాల కోసం ఉపయోగించుంటున్న ఆ బిజినెస్మ్యాన్ను చూసి అక్కడి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
కర్ణాటకలోని విజయపురకు చెందిన బాబూలాల్ చవాన్(49) గురించే మనం మాట్లాడుకునేది. గుజరాత్లో ఓ గుర్రాన్ని కొనుక్కొని విజయపురకు తీసుకొచ్చాడు. తన ఇంట్లో ఉన్న కారు, బైక్లను పక్కన పెట్టేసి ఆ గుర్రం మీదే తిరుగుతున్నాడు బాబూలాల్.
నిజానికి బాబూలాల్ ప్రతి నెల జిమ్ కోసం రూ.4000 ఖర్చు చేస్తాడట. అలాగే.. కారు, బైక్లలో పెట్రోల్ కోసం కూడా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వీటన్నింటి బదులు ఒక గుర్రాన్ని కొంటే పోలా.. అటు జిమ్కు వెళ్లాల్సిన పని లేకుండా.. ఇటు పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేకుండా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా గుర్రాన్ని కొన్నా. కాలుష్యాన్ని తగ్గించి.. పర్యావరణాన్ని కాపాడటం కోసం కూడా నా వంతు కృషి ఇది.. అంటూ చెప్పుకొచ్చాడు బాబూలాల్.