అంబాలా: హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్లో కురుస్తున్న వర్షాలకు .. యమునా నది ఉప్పొంగుతోంది. అంబాలా-యమునానగర్ రోడ్డుపై ఓ బస్సు బోల్తాపడింది(Bus Overturned). నదీ ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ వరద ధాటికి ఓ బస్సు ఓవర్టర్న్ అయ్యింది. అయితే బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులు .. ఆ బస్సుపై ఎక్కేశారు. రెస్క్యూ చర్యలు చేపట్టిన పోలీసులు ఆ ప్రయాణికుల్ని కాపాడారు. క్రేన్, తాడు సహాయంతో బస్సు ప్రయాణికుల్ని రక్షించారు. హర్యానా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.
ఉత్తరాదిలో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఆ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో బురదతో కూడిన వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ వరదల్లో ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోతున్నాయి.
భారీ వర్షాల వల్ల పంజాబ్, హర్యానాలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అంబాలాలో స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులు మూసివేశారు. మార్కండ, ఘాగర్, తంగ్రి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబాలా వద్ద డేంజర్ మార్క్ దాటి పారుతున్నాయి. పంచకుల జిల్లాలో కూడా స్కూళ్లను రెండు రోజుల పాటు బంద్ చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునా నది 205.40 మీటర్ల డేంజర్ మార్క్ను దాటేసింది.