VK Pandian | భువనేశ్వర్ : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రయివేటు సెక్రటరీగా కొనసాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ వీకే పాండియన్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడి పేరు తెచ్చుకున్న పాండియన్కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. 5టీ(Transformation Initiatives), నబిన్ ఒడిశా పథకానికి చైర్మన్గా పాండియన్ను నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ముఖ్యమంత్రి పట్నాయక్ కింద పాండియన్ పని చేయనున్నారు.
తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ ఒడిశా కేడర్కు చెందిన 2000 బ్యాక్ ఐఏఎస్ అధికారి. 2002లో కలహండి జిల్లాలోని ధర్మగర్హ్ సబ్ కలెక్టర్గా పాండియన్ తన ఐఏఎస్ కేరీర్ను ప్రారంభించారు. 2006లో మయూర్భంజ్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2007లో గంజం కలెక్టర్గా పని చేశారు. గంజం కలెక్టర్గా పని చేస్తున్న సమయంలోనే నవీన్ పట్నాయక్ దృష్టిని ఆకర్షించారు పాండియన్. నవీన్ పట్నాయక్ది కూడా గంజం జిల్లానే. 2011లో సీఎంవోలో చేరారు పాండియన్. అప్పట్నుంచి పట్నాయక్ ప్రయివేటు సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019లో ఐదోసారి సీఎంగా పట్నాయక్ ప్రమాణం చేసిన అనంతరం వీకే పాండియన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 5టీ సెక్రటరీగా నియామకం అయ్యారు.
వీకే పాండియన్ వీఆర్ఎస్ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్వాగతించారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వీకే పాండియన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఇక ఇప్పుడు ఆయన అధికారంగా బీజేడీలో చేరి రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందని ప్రతిపక్షాలు పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎస్ సలుజా స్పందించారు. వీకే పాండియన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆయన వీఆర్ఎస్ ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే.. ఆలస్యమైందన్నారు. ఒక వేళ ఆయన బీజేడీలో చేరితే.. ప్రతిపక్షాలకు మేలు జరుగుతుందని, ప్రత్యేకంగా కాంగ్రెస్కు ఎంతో సహాయం చేసిన వారవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉల్కా కూడా స్పందించారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే.. వీకే పాండియన్ సీఎం పదవి చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఒడిశాలో ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదన్నారు. కానీ ఎవర్ని ఎవరు నియంత్రిస్తున్నారో అందరికీ తెలుసు అని ఎంపీ సప్తగిరి పేర్కొన్నారు.
బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాజ్హీ మాట్లాడుతూ.. ఇప్పుడు వీకే పాండియన్ బహిరంగంగా రాజకీయాలు చేసుకోవచ్చన్నారు. అతన్ని ఒడిశా ప్రజలు అంగీకరించరు అని పేర్కొన్నారు.