న్యూఢిల్లీ, జూలై 8: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇన్చార్జి, నేషనల్ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సతీశ్ అగ్నిహోత్రిని రైల్వే శాఖ తప్పించింది. ఆయన గతంలో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) సీఎండీగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం, ఓ ప్రైవేటు కంపెనీకి నిధులను అక్రమంగా బదిలీ చేశారన్న ఆరోపణలపై అగ్నిహోత్రిని తొలగించినట్టు రైల్వే శాఖ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు బాధ్యతలను ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ డైరెక్టర్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్కు రైల్వేశాఖ అప్పగించింది. ఆయన ఈ బాధ్యతల్లో మూడు నెలల పాటు కొనసాగనున్నారు. అగ్నిహోత్రి గతంలో ఆర్వీఎన్ఎల్ సీఎండీగా తొమ్మిదేండ్లు పనిచేశారు. ఆ సమయంలో ఓ ప్రైవేటు కంపెనీతో ‘క్విడ్ ప్రోకో’కు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని లోక్పాల్ జూన్ 2న సీబీఐని ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టం-1988 కింద నేరం జరిగిందా లేదా అనేది తేల్చాలని, ఆర్నెల్లలో లేదా డిసెంబర్ 12లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 1982 బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ఈ అధికారి సతీశ్ అగ్నిహోత్రి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్లో 2021 జూలైలో చేరారు. ఎండీ అయిన తర్వాత బ్యాచ్మేట్లలో ఒకరు అగ్నిహోత్రిపై ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ నిబంధన ఉల్లంఘన..
ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ అనేది హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. మరోవైపు అగ్నిహోత్రి పదవీ విమరణ చేసిన ఏడాది లోగానే ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం పొందారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన అని, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రిటైర్డ్ అధికారులు ఏడాది నిండకముందే ఏదైనా కంపెనీలో లేదా వాణిజ్య సంస్థలో ఉద్యోగం పొందకూడదనే నిబంధన ఉన్నదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను సతీశ్ అగ్నిహోత్రి ఖండించారు. ఏ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించలేదని, ఇటువంటి పనులు చేసే ఏ కంపెనీలో తన కుమారుడు పనిచేయడం లేదని అగ్నిహోత్రి పేర్కొన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.