గౌహతి, నవంబర్ 19: దర్యాప్తు పేరుతో ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయటాన్ని గౌహతి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘బుల్డోజర్లతో కూల్చివేయాలన్నది చట్టంలో లేదు’ అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్సాంలోని నాగాన్ జిల్లాలోని భతద్రవ పోలీస్స్టేషన్లో సఫికుల్ ఇస్లాం (39) కస్టడీలోనే మృతిచెందాడు. దాంతో ఈ ఏడాది మే 21న కొందరు పోలీస్ స్టేషన్పై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరుసటి రోజు ఇండ్ల గోడల్లో ఆయుధాలు, డ్రగ్స్ దాచి పెట్టారని ఆరోపిస్తూ దర్యాప్తు పేరుతో నిందితుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. దీనిపై విచారణ చేపట్టిన గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం ఛాయ.. బుల్డోజర్లతో కూల్చివేతలు ఏ క్రిమినల్ చట్టంలోనూ లేవు, అది అత్యంత తీవ్రమైన కేసైనా సరే అంటూ స్పష్టం చేశారు. ఇల్లును కూల్చేసి అందులోంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకొన్నామని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొనగా, ఎవరైనా ఆ గోడల్లో పెట్టి ఉండవచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సినిమాల్లో ఇలాంటి కూల్చివేతలు జరిగినా, ముందుగా సెర్చ్ వారంట్ చూపిస్తారని గుర్తు చేశారు. బుల్డోజర్లతో ఇండ్ల కూల్చివేత గ్యాంగ్ వార్లా ఉన్నదని, దర్యాప్తు చేయాలనుకొంటే హోంశాఖ ఇంకా మంచి మార్గాలను అన్వేషించాలని చురక అంటించారు. శాంతిభద్రతలను నియంత్రించే పద్ధతి ఇది కాదని ప్రభుత్వానికి మొట్టికాయలు వేశారు.