బెంగళూరు: మత మార్పిడికి పాల్పడుతున్న అక్రమ చర్చిలను బుల్డోజర్లతో కూల్చాలని కర్ణాటకకు చెందిన శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, వేలాది మంది హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఆరోపించారు. దీనికి ఒక్కటే పరిష్కారమని అన్నారు. మత మార్పిడిని ప్రొత్సహించే అక్రమ చర్చిలను కూల్చివేసేందుకు కఠిన చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ చర్చిల జాబితాను తాను బయటపెడతానని, బుల్డోజర్లతో వాటిని కూల్చివేయాలని అన్నారు.
కాగా, మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠనానికి శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ సేన కార్యకర్తలు ఈ నెల 9న ఉదయం 5 గంటలకు అజాన్కు వ్యతిరేకంగా పలు ఆలయాల్లోని లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం సుప్రభాతంతోపాటు భక్తి పాటలను వినిపించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పలు ప్రాంతాల్లో శ్రీరామ్ సేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు.