కొత్తగా ఒక సంక్షేమం లేదు.. ధరాభారం నుంచి ఊరట లేదు.. రాయితీలు లేవు.. తాయిలాలు లేవు.. పన్ను ప్రోత్సాహకాలూ లేవు.. ఎన్నికల సంవత్సరంలో ఇంత నిస్తేజమైన బడ్జెట్ ఇప్పటివరకూ కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ సమర్పించిన దాఖలా లేదు. ఒక వైపు పన్ను వసూళ్లు బాగా పెరిగాయని, ద్రవ్యలోటు తగ్గిందని చెపుతూనే మరో వైపు ప్రజలు ఎదురుచూస్తున్న ఏ ఒక్కటీ పట్టనట్టే బడ్జెట్ను కేవలం ప్రభుత్వ ఆదాయం, ఖర్చులతో కూడిన ఒక ఖాతా పుస్తకంగా కేంద్రం పార్లమెంట్ ముందుంచింది. వ్యవసాయ రంగం కునారిల్లినందున రైతు రుణమాఫీ, ధరలు కొండెక్కినందున పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం కోత, వేతన జీవులకు ఊరటనిచ్చే పన్ను ప్రోత్సాహకాలు తదితరాలన్నింటినీ కేంద్రం విస్మరించింది.
Budget 2024 | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజాకర్షక పథకాలు లేవు.. పన్ను విధానంలో మార్పు లేదు. అలాగని.. సామాన్యులకు ఎటువంటి రాయితీలూ లేవు. త్వరలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం లోక్సభలో సాదాసీదా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్ను ప్రతిపాదించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల కోసం మాత్రమే తాత్కాలిక బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నామని, జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పారు. సంస్కరణలు కొనసాగిస్తామని, పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారతే తమకు ప్రాధాన్య అంశాలని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఉజ్వలంగా పురోగమిస్తున్నదని, ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా అదుపు చేయగలిగామని చెప్పారు. గత పదేండ్లలో వివిధ రంగాలలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెట్టిన ఆర్థిక మంత్రి.. తమ హయాంలో దేశం పరివర్తన చెంది ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. మూడో పర్యాయం కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2047 నాటికి భారత్ను పూర్తిస్థాయి అభివృద్ధి దేశంగా మారుస్తామని అన్నారు. సుస్థిరమైన మౌలిక సదుపాయాల పెంపుద్వారా ఉద్యోగావకాశాలను సృష్టించడంపై దృష్టి పెడతామని చెప్పారు.
రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు వ్యయాన్ని11 శాతం పెంచి రూ.11.1 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మౌలిక సదుపాయాలపై ఖర్చు పెట్టేందుకు రాష్ర్టాలకు రూ.1.3 లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణాలను ఇవ్వనున్నట్టు చెప్పారు.ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పు లేదని తెలిపారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఆదాయ పన్ను విధానంలో మార్పు ఉండదని, దిగుమతి, ఎగుమతి సుంకాల్లో కూడా మార్పులేవీ చేయడం లేదన్నారు. 2014-15 సంవత్సరానికి ముందు వివాదాస్పద ట్యాక్స్ డిమాండ్లపై చెల్లింపుదారులకు ఊరట కల్పించారు.
ఆహార పదార్థాలు, ఎరువులు, ఇంధనంపై ఇస్తున్న సబ్సిడీలను ఎనిమిది శాతం తగ్గిస్తున్నట్టు నిర్మల సీతారామన్ ప్రకటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులలో ఎటువంటి మార్పూ లేదని చెప్పారు. వచ్చే ఐదేండ్లలో మధ్య తరగతి వర్గాల కోసం ఓ పథకాన్ని ప్రారంభించి రెండు కోట్ల గృహాలను నిర్మించనున్నామని తెలిపారు. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి వాటికి ప్రపంచస్థాయిలో ప్రచారం కల్పిస్తామని చెప్పారు. పంటల కోతల అనంతరం జరిగే వ్యవసాయ కార్యకలాపాలలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రూఫ్టాప్ సోలార్ స్కీమ్ ద్వారా కోటి గృహాలకు ఒక్కోదానికి నెలకు 300 యూనిట్ల చొప్పున విద్యుత్తును ఉచితంగా అందిస్తామన్నారు. ఇన్నోవేషన్, టెక్నాలజీకి లక్ష కోట్ల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని, ఇందులోంచి 50 ఏండ్లకు వడ్డీ రహిత, అతితక్కువ వడ్డీతో టెక్ ఔత్సాహికులకు రుణాలిస్తామని చెప్పారు. రక్షణ రంగంలో ‘డీప్ టెక్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.
ఖర్చుల్లో పెరుగుదల, మూలధన వ్యయానికి, సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెరిగిన నేపథ్యంలో బడ్జెట్ను గత ఏడాది కన్నా 6.1 శాతం పెంచుతూ రూ.47.66 లక్షల కోట్లతో ప్రతిపాదిస్తున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 5.1 శాతానికి తగ్గించనున్నామని చెప్పారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత (2023-24) సంవత్సరంలో ద్రవ్య లోటు 5.8 శాతంగా నమోదైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ.30 లక్షల కోట్లు ఉంటుందని అంచనా పన్నులు-జీడీపీ నిష్పత్తి 11.7 శాతంగా ఉండవచ్చని పేర్కొన్నారు. గత పదేండ్లలో 596 లక్షల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు.
వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రతిపాదించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం 56 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించారు. 2020లో 2.40 గంటలు బడ్జెట్ ప్రసంగించిన నిర్మల ఆ తరువాత ఏటా తన ప్రసంగాన్ని కుదించుకుంటూ వస్తున్నారు. ఈ సారి సుమారు ఎనిమిదిసార్లు ఆమె మోదీ ప్రసంగాల నుంచి కొన్ని మాటలను ఉటంకించారు. ఎఫ్డీఐ, జీడీపీలకు నిర్మల కొత్త నిర్వచనం ఇచ్చారు. ఎఫ్డీఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా (ముందుగా భారత అభివృద్ధి) అని, జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ (పరిపాలన, పురోగతి, పనితీరు) అని పేర్కొన్నారు. గ్యాలరీలో కొద్దిమంది రాజ్యసభ సభ్యులు, నిర్మల కుటుంబ సభ్యులు తప్ప అంతా ఖాళీగా కనిపించాయి. ప్రధాని సభకు వచ్చినప్పుడు బీజేపీ సభ్యులు భారత్ మాతాకీ జై, జై సియారాం అంటూ నినాదాలు చేశారు. లోక్సభకు రాకముందు నిర్మల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు.
రాష్ర్టాలకిచ్చే నిధుల గురించి బడ్జెట్లో ఒక్క మాట లేదు. వాళ్లు సమాఖ్యవాదానికి తూట్లు పొడిచి ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో దేన్నీ అమలు చేయని వీరికి ప్రజలు గుణపాఠం చెబుతారు.
– డెరెక్ ఓబ్రియెన్, టీఎంసీ ఎంపీ
2015 నుంచి ప్రజల ఆదాయ స్థాయిలు 50% కుంచించుకుపోయాయి. అప్పులు ఎక్కువయ్యా యి. ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఆహర ద్రవ్యోల్బణం అధికమైంది. వీటినెలా పరిష్కరిస్తారో బడ్జెట్లో ప్రస్తావించలేదు.
– శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
బడ్జెట్ నిరాశపరిచింది. పన్ను రాయితీలు లేవు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారాస్థాయికి చేరాయి. మహిళల భద్రత, సాధికారత అమల్లో కనిపించడం లేదు.
– స్వాతి మలివాల్, ఆప్ ఎంపీ
చెప్పడానికి, చేయడానికి చాలా తేడా ఉంది. పదేండ్లుగా చూస్తున్నది ఇదే. పేదలు, మహిళలు, యువతకు ఈ బడ్జెట్లో ఏమీ లేదు. సాధారణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.
– ప్రియాంక చతుర్వేది, శివసేన(యూబీటీ) ఎంపీ