Mayawati : బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రచార పర్వంలోకి దిగనున్నారు. కొన్ని రోజులుగా రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్న బెహన్జీ.. ఎన్నికల షెడ్యూల్ తర్వాత మెళ్లి మెళ్లిగా యాక్టివ్ అవుతున్నారు. ఇక.. ప్రచార పర్వంలోకి కూడా దిగుతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి మిశ్రా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వచ్చే నెల 2 నుంచి ఆగ్రా నియోజకవర్గం నుంచి మాయవతి ప్రచారాన్ని ప్రారంభిస్తారని సతీశ్ చంద్ర మిశ్రా మంగళవారం ప్రకటించారు. కోవిడ్ నియమాలను పాటిస్తూనే మాయావతి సభలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అతి త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ప్రచారంలో కాంగ్రెస్పై తీవ్రంగా విరుచుకుపడతారని బీఎస్పీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం ఓ ట్వీట్లో మాయావతి కాంగ్రెస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూపీలో కాంగ్రెస్ పని అయిపోయిందని, కేవలం ఓట్లను చీల్చే పనిలోనే కాంగ్రెస్ ఉండిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్కు ఓటు వేయడం వృథా అంటూ ఘాటైన విమర్శలు చేశారు మాయావతి. కాంగ్రెస్కు ఓటు వేసే బదులు, బీఎస్పీకే ఓట్లు వేయాలని ఆమె ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. యూపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాయావతి మౌనంగా ఎందుకున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రశ్నించినప్పటి నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.