Mayawati | లక్నో : విపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరం, దురదృష్టకరం అని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఉభయసభల నుంచి 150 మంది ఎంపీలపై వేటు వేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లక్నోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాయావతి మాట్లాడారు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో దాదాపు 150 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రభుత్వానికి లేదా ప్రతిపక్షానికి మంచిది కాదని తమ పార్టీ విశ్వసిస్తోంది అని మాయావతి పేర్కొన్నారు. పార్లమెంటు చరిత్రలో ఈ ఘటన విచారకరం, దురదృష్టకరం అని చెప్పారు. ఉభయసభలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఈ చర్య వమ్ము చేస్తుందని పేర్కొన్నారు.
అటు అధికారపక్షం, ఇటు విపక్షం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షం లేకుండా మూడు కీలక బిల్లులను ఆమోదించడం సరికాదన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఇక పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటన దేశ ప్రజలందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. పార్లమెంట్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మాయావతి డిమాండ్ చేశారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదన్నారు.
ఇప్పటి వరకు లోక్సభ నుంచి 97 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయసభల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.