లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కింది. ఏడు దశల పోలింగ్ ప్రక్రియలో భాగంగా జరిగే తొలి దశ పోలింగ్కు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్నది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. కానీ బీఎస్పీ చీఫ్ మాయావతి మాత్రం ఈ ఎన్నికలను అంత సీరియస్గా తీసుకోవడం లేదు. ఆఖరికి వివిధ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలో కూడా ఆమె తీవ్ర జాప్యం చేస్తున్నారు.
ఫిబ్రవరి 14న రెండో దశ పోలింగ్ జరుగనున్న స్థానాలకు ఆమె ఇవాళ అభ్యర్థులను ప్రకటించారు. రెండో దశలో మొత్తం 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుండగా మాయావతి 51 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ బూత్లో గెలువాలి.. బీఎస్పీ సత్తా చాటాలి అనేది ప్రస్తుత ఎన్నికల్లో తమ నినాదమని చెప్పారు. కార్యకర్తలు బాగా శ్రమిస్తారని, 2007లోలా బీఎస్పీ అధికారంలోకి వస్తుందని మాయావతి ధీమా వ్యక్తంచేశారు.
కాగా, తాను బలంగా పోటీలో ఉంటే పరోక్షంగా బీజేపీకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈసారి మాయావతి సైడ్ అయిపోయినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వ్యతిరేక దళిత, బహుజన ఓట్లు బీఎస్పీ, ఎస్పీ మధ్య చీలిపోయి బీజేపీ లబ్దిపొందే ప్రమాదం ఉన్నందున.. ఆ ఓట్లు చీలకుండా మాయవతి సైలెంట్ అయ్యారు. పరోక్షంగా ఎస్పీకే గంపగుత్తగా దళిత, బహుజన ఓట్లు పడేలా వ్యవహరిస్తున్నారు.