న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన ఓ చొరబాటుదారుడు హతమయ్యాడు. మారణాయుధంతో భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన పాక్ చొరబాటుదారుడిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బలగాలు గమనించి కాల్చిపారేశాయి. ఇవాళ ఉదయం 8.30 గంటల సమయంలో పంజాబ్లోని గురుదాస్పూర్ సెక్టార్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గురుదాస్పూర్ సెక్టార్లోని చన్నా ఔట్పోస్ట్ దగ్గర గస్తీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు అనుమానాస్పద కదలికలను గమనించారు. ఓ సాయుధుడిగా ఫెన్సింగ్ వైపు రావడాన్ని చూశారు. నిషేధిత ప్రాంతంలోకి రావద్దని జవాన్లు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా ఆ సాయుధుడు ముందుకే రావడంతో కాల్చిచంపారు. మృతదేహం దగ్గర ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ముందుజాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.