భోపాల్: 128 చక్రాల వాహనం భారీ లోడ్తో వంతెనపై వెళ్తుండగా అది కూలింది. దీంతో వంతెన కింద ఎండిన నదీ ప్రాంతంలో ఆ వాహనం పడింది. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల పొడవు, భారీగా బరువున్న విద్యుత్ పరికరాన్ని మధ్యప్రదేశ్లోని ఇటార్సీ పవర్ గ్రిడ్కు 128 చక్రాల వాహనంలో తరలిస్తున్నారు. మార్చి 6న ఈ వాహనం హైదరాబాద్ మీదుగా వెళ్లింది. నాగపూర్-భోపాల్ జాతీయ రహదారిలోని సుఖ్తవా నదిపై ఉన్న బ్రిడ్జీ మీదుగా ఆదివారం వెళ్తుండగా బరువుకు తాళలేక ఆ వంతెన కూలిపోయింది. దీంతో 128 చక్రాల వాహనం సగ భాగం, భారీ విద్యుత్ పరికరం ఒకవైపు పడగా, వాహనం మరో భాగం వంతెన నుంచి కిందకు వేలాడింది.
ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఆ వాహనం డ్రైవర్ మాత్రం గాయపడ్డాడు. మరోవైపు నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే 25 అడుగుల పొడవైన ఈ వంతెన కూలిపోవడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు ట్రాఫిక్ను మరో మార్గంలో మళ్లించారు.