ఇటా: ఉత్తరప్రదేశ్లో ఓ వధువు.. వరుడి నుంచి మెడికల్ సర్టిఫికేట్ డిమాండ్ చేసింది. పెళ్లి వేడుక సమయంలో వరుడు కూర్చీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అక్కడ హైరానా ఏర్పడింది. కొందరు అతనికి నీళ్లు తాగించారు. కొందరు డాక్టర్ కోసం పరుగులు తీశారు. భారీ ఊరేగింపు నడుమ పెళ్లి వేదికకు వరుడు చేరుకున్న తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నది. అయితే పెళ్లి సంబరాల వేళ వరుడు కుర్చీ నుంచి కిందపడిపోవడం పట్ల వధువు అభ్యంతరం వ్యక్తం చేసింది. వరుడికి ఆరోగ్య పరీక్షలు చేయించాలని పట్టుపట్టింది. హెల్త్ రిపోర్టు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని భీష్మించింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. అయినా ఆ అమ్మాయి వినలేదు. ఇటా జిల్లాలోని కథోని గ్రామానికి చెందిన వరుడు .. సాకిత్ గెస్ట్ హౌజ్ చేరుకున్న తర్వాత ఈ ఘటన జరిగింది. వరుడి ఆరోగ్యంపై వధువు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో పెళ్లి ఆగిపోయింది. వరుడి ఆరోగ్యం గురించి దాచి పెట్టారని వధువు ఫ్యామిలీ ఆరోపించింది. కానీ ఈ ఘటన గురించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాలేదు.