రాయ్పూర్: పెళ్లి బృందంతో వెళ్లున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన అప్పుడే పెళ్లైన నవ వధువు, వరుడితో సహా ఐదుగురు మరణించారు. (Bride, Groom Killed ) దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బలోడా గ్రామానికి చెందిన శుభమ్ సోనీకి శివనారాయణ్ టౌన్కు చెందిన మహిళతో శనివారం రాత్రి వివాహం జరిగింది. అనంతరం నవ జంట, మరో ముగ్గురు కారులో వరుడి గ్రామమైన బలోడాకు బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున ముల్ముల పోలీస్ స్టేషన్ పరిధిలోని పకారియా ఝులన్ గ్రామ సమీపంలో వారు ప్రయాణించిన కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట, కారు నడుపుతున్న వరుడి తండ్రి ఓంప్రకాష్ సోనీ, అందులో ఉన్న మరో ఇద్దరు మరణించారు.
కాగా, ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారును ఢీకొట్టిన తర్వాత లారీ వదిలేసి పారిపోయిన డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.