న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్ 13వ సదస్సు భారత్ అధ్యక్షతన గురువారం ఆన్లైన్లో జరిగింది. తాలిబన్ల ఆక్రమణతో సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్లో హింసకు తావివ్వకూడదని, శాంతియుత మార్గాల ద్వారా పరిస్థితిని పరిష్కరించాలని బ్రిక్స్ దేశాల నేతలు పిలుపునిచ్చారు. ఆ దేశంలో స్థిరత్వం, పౌర శాంతి, శాంతిభద్రతల కోసం ఆఫ్ఘన్పై అంతర్గత చర్చలు జరుగాలని ఆకాక్షించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదుల స్థావరంగా ఆఫ్ఘన్ మారకుండా, ఇతర దేశాలపై ఉగ్ర దాడులకు పాల్పడకుండా చూడటం, సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలు, టెర్రరిజం ఫైనాన్సింగ్ నెట్వర్స్ను కట్టడి చేయడం వంటివి ఢిల్లీ డిక్లరేషన్లో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన బ్రిక్స్ ఆన్లైన్ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొన్నారు. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో కొత్త సంక్షోభం నెలకొన్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ప్రపంచం, ఈ ప్రాంత భద్రతపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న దానిపై స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా, ఐదు బ్రిక్స్ దేశాలు సమగ్రత, సమానత్వ స్ఫూర్తితో వ్యూహాత్మక కమ్యూనికేషన్, రాజకీయ విశ్వాసాన్ని పెంపొందించుకున్నాయని అన్నారు. దేశాలు పరస్పరం సంభాషించుకోవడానికి ఒక సామాజిక వ్యవస్థ, అభివృద్ధి, మంచి మార్గాన్ని అన్వేషించాయని పేర్కొన్నారు. ‘ఈ సంవత్సరం ప్రారంభం నుండి, మన ఐదు దేశాలు BRICS సహకారం యొక్క వేగాన్ని కొనసాగించాయి. అనేక రంగాలలో కొత్త పురోగతిని సాధించాయి. మన మనస్సు, ప్రయత్నాలు కలిసి ఉన్నత కాలం, బ్రిక్స్ సహకారంలో ఘనమైన పురోగతిని సాధించగలం’ అని వెల్లడించారు.
బ్రిక్స్ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలపై దృష్టి కేంద్రీకరించడానికి బ్రిక్స్ ప్లాట్ఫాం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ‘ఈ రోజు మనం ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఒక ప్రభావవంతమైన స్వరం. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలపై కూడా దృష్టి కేంద్రీకరించడానికి ఈ వేదిక ఉపయోగకరంగా ఉంది’ అని చెప్పారు. బ్రిక్స్ 15వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ సదస్సు థీమ్ను ‘BRICS@15: కంటిన్యూటీ, కన్సాలిడేషన్, ఏకాభిప్రాయం కోసం ఇంట్రా-బ్రిక్స్ సహకారం’గా పేర్కొన్నారు.
కాగా, ప్రధాని మోదీ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించడం ఇది రెండోసారి. 2016లో జరిగిన గోవా సదస్సుకు కూడా ఆయన అధ్యక్షత వహించారు.