న్యూఢిల్లీ, మే 16: ఇల్లు కిరాయికి ఇచ్చేముందు కూడా అద్దెకు ఉండేవారి గురించి ఒకటికి రెండుసార్లు ఆరా తీస్తాం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 4 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ‘పవన్హన్స్’ హెలికాఫ్టర్ల సంస్థను విక్రయించే ముందు ఎన్నిసార్లు ఆలోచించాలి? అయితే, మోదీ సర్కారుకు ఆ సోయి లేకుండా పోయింది. సరే, కొనుగోలు చేసే సంస్థలో లొసుగులు ఉన్నాయని ఆలస్యంగా తెలిసినప్పుడైనా, విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి కదా! అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం ఆ చర్యలను చేపట్టలేదు. లొసుగుల విషయం బయటకు వస్తే, అప్పుడు చూద్దాంలే.. అంటూ డీల్ ప్రక్రియను ముందుకు కొనసాగించింది. చివరకు, కొనుగోలు చేసే కంపెనీ ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు కోర్టు ఇచ్చిన ఆర్డర్లు బయటకు వచ్చాయి. దీంతో చేసేదేమీలేక, ‘పవన్హన్స్’ డిజిన్వెస్ట్మెంట్ నుంచి వెనక్కు తగ్గుతున్నట్టు బీజేపీ సర్కారు సోమవారం ప్రకటించింది. లోపభూయిష్టతకు మోదీ పాలన తార్కాణం అనడానికి ‘పవన్హన్స్’ డీల్ తాజా ఉదాహరణ.
అసలేమైంది?
పవన్హన్స్లో 51 శాతం వాటాను కేవలం రూ.211.14 కోట్లకు స్టార్9 మొబిలిటీ కన్సార్షియానికి అమ్మే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ కొద్దిరోజుల క్రితమే ఆమోదముద్ర వేయడం తెలిసిందే. ఈ కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్ కూడా ఉన్నది. అయితే, ఆ కంపెనీపై ఓ పాత కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్కతా బెంచ్ దివాలా కోడ్ సెక్షన్ 74 (3) కింద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న కోల్కతాకు చెందిన ఈఎంసీ లిమిటెడ్ కొనుగోలు బిడ్ను 2019లో అల్మాస్ గెలుచుకుంది. దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా ఈఎంసీకి చెల్లించాల్సిన రూ.568 కోట్లను అల్మాస్ అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తుండటంతో రిజల్యూషన్ అధికారి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. దీంతో అల్మాస్ గ్లోబల్ వ్యవహారశైలిని ట్రిబ్యునల్ తప్పుబడుతూ, అల్మాస్ సమర్పించిన రూ.30 కోట్ల విలువగల రెండు బ్యాంక్ గ్యారంటీలను రద్దుచేసింది. ఈ కంపెనీపై, దాని అధికారులపై ప్రొసీడింగ్ చర్యల్ని చేపడుతూ 2022 ఏప్రిల్ 22న ఎన్సీఎల్టీ కోల్కతా బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది.
తెలిసి కూడా ముందుకు..
ఏప్రిల్ 22న అల్మాస్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోల్కతా బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇది జరిగిన వారానికి అంటే ఏప్రిల్ 29న పవన్హన్స్ విక్రయ బిడ్ను క్యాబినెట్ ఆమోదించింది. కొనుగోలు చేసే సంస్థపై ఆర్థిక నేరాల ఆరోపణలు ఉన్నప్పుడు కేంద్రం ఎలా బిడ్ను ఆమోదించిందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
6 నెలల్లో రెండో దెబ్బ
ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతున్న కేంద్రానికి గత ఆరు నెలల్లో ఇది రెండో దెబ్బ. గత నవంబర్లో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సెల్)ను కేంద్రం విక్రయానికి పెట్టింది. అయితే, సక్సెస్ఫుల్ బిడ్డర్గా ప్రకటించిన సంస్థపై ఆర్థిక నేరారోపణలు వచ్చాయి. దీంతో విక్రయాన్ని నిలిపేస్తున్నట్టు గత ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంట్కు తెలియజేసింది.