Brahmos missile | బ్రహ్మోస్ క్షిపణి ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ను భారత వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. సుఖోజ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించి లక్ష్యాన్ని ఛేదించారు. ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బంగాళాఖాతంలో ఆశించిన లక్ష్యాన్ని అందుకున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ పరీక్షతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సుఖోయ్ జెట్ ఫైటర్ నుంచి భూమి/సముద్రంపైని లక్ష్యంపై ఖచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని పెంచుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది సుఖోయ్ జెట్ ఫైటర్ నుంచి జరిపిన బ్రహ్మోస్ క్షిపణి ఎక్స్టెండెడ్ వెర్షన్ మొదటి ప్రయోగం. బ్రహ్మోస్ క్షిపణి ఎక్సెటెండెడ్ వెర్షన్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నది. ఈ పరీక్షలతో వైమానిక దళం, భారత నౌకాదళం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), బ్రహ్మోస్ ఏరోస్పేస్ (బీఏపీఎల్) సంయుక్తంగా జరిపిన ప్రయోగాత్మక కాల్పులు విజయవంతమయ్యాయి.
ఈ ఏడాది మే నెలలో సుఖోయ్ యుద్ధ విమానం నుంచి సూపర్సోనిక్ క్షిపణి ఎక్స్టెండెడ్ శ్రేణి వెర్షన్ను విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి ఎక్స్టెండెడ్ రేంజ్ 290 కి.మీ నుంచి 350 కి.మీలకు పెరిగింది. కాగా, ప్రస్తుతం పరిధి విస్తరించిన క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని సముద్ర లక్ష్యాన్ని ఛేదించగలగడం విశేషం. ఈ బ్రహ్మోస్ క్షిపణిని గాలి, భూమి, సముద్రం ప్లాట్ఫాంల నుంచి ప్రయోగించగలిగే వీలున్నది. ఈ క్షిపణి ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ సూత్రంపై పనిచేస్తుంది.