లక్నో, అక్టోబర్ 4: ఉత్తరప్రదేశ్లోని మరో అమానుష ఘటన చోటుచేసుకున్నది. ప్రతాప్గఢ్ జిల్లాలోని ఉద్దా అనే గ్రామంలో ఓ దళితున్ని హత్య చేశారు. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల కిత్రం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్యకు కులం కారణం కాదని పైకి చెబుతున్న పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం.
దురాగతంపై జగ్రూప్ భార్య మాట్లాడుతున్న వీడియోను ఓ హిందీ న్యూస్ పోర్టల్ తాజాగా ట్విట్టర్లో పోస్టు చేసింది. దుర్గా పూజను చూసేందుకు తన భర్త సమీపంలోని ఓ ఇంటికి వెళ్లాడని, అక్కడ అతన్ని కొట్టి చంపారని పేర్కొన్నారు. మున్నా, సందీప్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించారు. ఆ వీడియోలో మూటకట్టిన జగ్పూర్ శవం కూడా కనిపిస్తున్నది. మరో వీడియోలో జగ్రూప్ అల్లుడు మాట్లాడుతూ.. తన మామ విగ్రహం పాదాలు తాకాడని, అక్కడున్న వారు విచక్షణారహితంగా కొట్టారని, తర్వాత ఇంటి వద్దకు తెచ్చి పడేశారని తెలిపారు. చికిత్స కోసం దవాఖానకు తరలించామని, అయితే అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారని వివరించారు.