లక్నో: వివాహితను ప్రియుడు గర్భవతిని చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఆ మహిళను హత్య (Woman Murder) చేశాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 2న ఒక మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలిని రాంబిరిగా గుర్తించారు. ఆమె గర్భవతి అని పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది.
కాగా, మృతురాలు రాంబిరి హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2015లో వినోద్తో ఆమెకు పెళ్లైందని తెలిపారు. ఏడాది తర్వాత ఆ జంట విడిపోయినట్లు చెప్పారు. తండ్రి ఇంట్లో ఉంటున్న రాంబిరికి, ఆదేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారిద్దరి మధ్య సంబంధం నెలకొన్నదని చెప్పారు. ఈ క్రమంలో రాంబిరి గర్భం దాల్చినట్లు వెల్లడించారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆదేశ్ను ఆమె ఒత్తిడి చేసిందన్నారు.
మరోవైపు పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్న రాంబిరి అడ్డు తొలగించుకునేందుకు ఆదేశ్ కుట్రపన్నాడు. ఈ నెల 2న తనను కలువాలంటూ తన ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన రాంబిరిపై స్నేహితులతో కలిసి దాడి చేశాడు. ఇటుకలతో కొట్టి ఆమెను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పొలాల్లో పడేసి పారిపోయారు. రాంబిరి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆదేశ్తోపాటు అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్గా గుర్తించారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.