SAU | న్యూఢిల్లీ: ఆ విద్యార్థి పేరు భీంరాజ్ ఎం. చెన్నైకి చెందిన ఈ దళిత లా స్కాలర్ను ఓ ఆందోళనలో పాల్గొన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (ఎస్ఏయూ) బహిష్కరించింది. అయితేనేం.. ఇప్పుడా విద్యార్థి స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసేందుకు వెళ్తున్నాడు. భీంరాజ్ చెన్నైలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో ఎల్ఎల్ఎం అందుకున్నాడు. ఎస్ఏయూలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు ైస్టెపెండ్ తగ్గించడం, యూనివర్సిటీ హరాస్మెంట్ కమిటీల్లో స్టూడెంట్ సభ్యులను చేర్చుకోకపోవడం వంటి వివక్ష పూరిత, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో భీంరాజ్ పాలుపంచుకున్నాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన యూనివర్సిటీ భీంరాజ్ సహా మరో ఐదుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది.
2022లో ఎలాంటి విచారణ లేకుండానే ఏడాదిపాటు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత భీంరాజుతోపాటు మరో విద్యార్థిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. దీనిని వారు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురైన భీంరాజ్కు తర్వాత ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చదివేందుకు రతన్షా బొమాంజీ జైవాలా స్కాలర్షిప్ లభించింది. అయితే, ఇది ట్యూషన్ ఫీజులకు మాత్రమే పరిమితం కావడంతో అక్కడ ఉండేందుకు, ఇతర అవసరాల కోసం క్రౌడ్ఫండింగ్ ద్వారా రూ. 15 లక్షలను సేకరించగలిగాడు. తమిళనాడు ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున అంబేద్కర్ విగ్రహం, పుస్తకంతోపాటు రూ. 15 లక్షలు ఇచ్చారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు తాను నిబద్ధతతో ఉన్నట్టు భీమ్రాజ్ తెలిపాడు.