చండీగఢ్: క్రికెట్ అకాడమీలోని పిచ్ రోలర్ అకస్మాత్తుగా ముందుకు కదిలింది. దాని కింద నలిగి 8 ఏళ్ల బాలుడు మరణించాడు. ఇది చూసి అక్కడ ఆడుకుంటున్న మిగతా పిల్లలు భయంతో పారిపోయారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Pitch Roller Crushes Boy) ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. బీహార్లోని నలంద ప్రాంతానికి ఒక కుటుంబం గురుగ్రామ్లో నివసిస్తున్నది. ఆ కుటుంబానికి చెందిన 8 ఏళ్ల ఆకాష్ కుమార్ తన సోదరుడు నీల్, ఇతర పిల్లలతో కలిసి క్రికెట్ అకాడమీలో ఆడుకున్నాడు.
కాగా, అక్కడ నిలిపి ఉంచిన మినీ పిట్ రోలర్కు ఒక పిల్లవాడి చేయి తగలడంతో సర్క్యూట్ బ్రేకర్ యాక్టివేట్ అయ్యింది. దీంతో ఉన్నట్టుండి అది ముందుకు కదిలింది. అక్కడున్న ఆకాష్ ఆ రోలర్ ముందు పడి నలిగిపోయాడు. ఈ ప్రమాదాన్ని చూసిన మిగతా పిల్లలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఆకాష్ కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అతడ్ని తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆ రోలర్ను పరిశీలించారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ రోలర్ను పర్యవేక్షించడానికి అక్కడ ఎవరూ లేరని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఆకాష్ మరణించాడో అన్నది కూడా అతడి కుటుంబం ఆరోపించలేదు. పోస్టుమార్టం అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.