పాట్నా: మహారాష్ట్ర శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వంటి వ్యక్తి కోసం బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీ(యూ) వెతుకుతున్నాయని ఎల్జేపీ మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. తద్వారా ప్రతిపక్ష పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. తన బాబాయ్, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ ఎల్జేపీని హస్తగతం చేసుకున్న పరిణామాల అనంతరం చాలా కాలం తర్వాత చిరాగ్ పాశ్వాన్ మీడియాతో ఆదివారం మాట్లాడారు. బీహార్కు చెందిన నలుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు ఇటీవల ఆర్జేడీలో చేరడంతో ఆ పార్టీ సింగిల్ మెజార్టీగా నిలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బీజేపీ సంఖ్యను తగ్గించడంలో సీఎం నితీశ్ కుమార్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. నలుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు తొలుత జేడీ(యూ)లో చేరేందుకు ఆ పార్టీని సంప్రదించారని తెలిపారు. అయితే చివరకు వారు ఆర్జేడీలో చేరారని, దీని వెనుక సీఎం నితీశ్ కుమార్ ఉన్నారని విమర్శించారు. బీజేపీ పెద్ద పార్టీగా ఉండకూడదనే ఆయన అలా వ్యవహరించారని అన్నారు.
కాగా, బీహార్లో కేవలం అధికారం కోసమే బీజేపీ, జేడీ(యూ) జత కట్టాయని చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. అందుకే ప్రభుత్వంలోని మిత్రపక్షాన్ని కిందకు లాగేందుకు మహారాష్ట్రలో మాదిరిగా ఏక్నాథ్ షిండే వంటి వ్యక్తి కోసం ఆ రెండు పార్టీలు వెతుకుతున్నాయని అన్నారు. ఎన్ఆర్సీ, కుల గణన వంటి అంశాలపై సీఎం నితీశ్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ బీజేపీ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఆయన ఎంపీ స్థానమైన హాజీపూర్లో విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. దీనికి పశుపతి కుమార్ పరాస్ను కూడా ఆహ్వానిస్తానని చెప్పారు.