పెండ్లి కోసం బోర్డర్ దాటిన బెంగాలీ యువకుడు
తిరిగి వస్తుండగా అరెస్టు
కోల్కతా, జూన్ 28: ఫేస్బుక్లో కలిసిన ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ యువకుడు.. ఆమెను పెండ్లి చేసుకోవడానికి సరిహద్దు కంచెను అక్రమంగా దాటాడు. దాటడమైతే దాటి అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు గానీ తిరిగి వచ్చే సమయంలో దొరికిపోయాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లా అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నదియాలోని బల్లవ్పూర్ గ్రామానికి చెందిన చంద్ర రాయ్, బంగ్లాదేశ్లోని నెరాలికి చెందిన అమ్మాయిని ఫేస్బుక్లో కలిశాడు. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న బోర్డర్ దాటిన చంద్ర.. అక్కడికి వెళ్లి ఆ యువతిని పెండ్లి చేసుకున్నాడు. జూన్ 26 న భారత్కు తిరిగివచ్చే సమయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు వారిని ఆపి ధ్రువీకరణ పత్రాలు అడిగారు. చంద్ర భారత ధ్రువపత్రాలు చూపించగా.. ఆయన భార్య మాత్రం విఫలమైంది. దీంతో బీఎస్ఎఫ్ వారిని అదుపులోకి తీసుకుని భీమ్పూర్ పోలీసులకు అప్పగించారు.