ఇంఫాల్/కోచి, జూన్ 16: ఇంఫాల్లోని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్కే రాజన్ సింగ్ ఇంటిపైకి గురువారం రాత్రి అల్లరి మూక బాంబు దాడికి పాల్పడింది. భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ సకాలంలో మంటలను ఆపడంతో పెద్ద నష్టం తప్పింది. దాడి జరిగిన సమయంలో మంత్రి ఇంట్లో లేరు. గురువారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు, అల్లరి మూక మధ్య జరిగిన ఘర్షణల్లో రెండు ఇండ్లు తగలబెట్టిన కొద్ది గంటలకే మంత్రి ఇంటిపై బాంబు దాడి జరగడం గమనార్హం. దాడి ఘటనపై కొచ్చిలో ఉన్న మంత్రి స్పందిస్తూ… మణిపూర్లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇంఫాల్లో కాల్పుల మోతలు వినిపించాయి. అల్లరి మూక ఒక గోదామును తగుల బెట్టింది. దీంతో అల్లరి మూకను చెదర గొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు రాష్ట్రంలో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని స్వదేశీ గిరిజన నాయకుల ఫోరం(ఐటీఎల్ఎఫ్) డిమాండ్ చేసింది.