ముంబై, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముంబైలోని చాందివాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలకు ఏప్రిల్ 16, 17 తేదీల్లో డయాగ్నొస్టిక్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి నసీమ్ ఖాన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. దేశ ఎన్నికల చరిత్రలో ఇటువంటి సాంకేతిక పరీక్ష జరగడం ఇదే మొదటిసారి. ‘ఇది ప్రజాస్వామ్య విజయానికి తొలి అడుగు. ఈవీఎంల విశ్వసనీయతపై మేము లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పుడు సాంకేతిక ముద్ర లభిస్తుంది. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరగనున్న ఈ విచారణ ద్వారా ప్రజల ముందు నిజం బయటపడుతుంది అని పిటిషనర్ నసీమ్ ఖాన్ అన్నారు. నసీమ్ ఖాన్ 20,625 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఏప్రిల్ 2024 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5% ఈవీఎంలను ధృవీకరించడానికి ఒక నిబంధన ఉంది. దీని ప్రకారం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు చెందిన నిపుణులైన ఇంజినీర్లు చాందివాలిలోని వీవీప్యాట్లో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, మైక్రో కంట్రోలర్ను తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో, యంత్రానికి చెందిన బర్న్ మెమొరీలోని డాటాను, వాస్తవ ఓటింగ్ డాటాను తనిఖీ చేస్తారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో, చాందివాలి నియోజకవర్గంలో శివసేన (షిండే వర్గం)కు చెందిన దిలీప్ లాండే, నసీమ్ ఖాన్ (కాంగ్రెస్)ను స్వల్ప తేడాతో ఓడించారు. అయితే, ఓట్ల లెకింపులో అవకతవకలు జరిగాయని పేరొంటూ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి సోమశేఖర్ సుందరేశన్ దీనిపై విచారణకు ఆదేశించారు.
1. ఈవీఎం మైక్రో కంట్రోలర్లోని ప్రోగ్రామింగ్ ను సరిచూడటం.
2. ఎన్నికల ఫలితాల తర్వాత డాటాలో అవకతవకలు జరిగాయా లేదా అని నిర్ధారించడానికి సాంకేతిక ధృవీకరణను నిర్వహించడం.
3. సుప్రీం కొత్త నిబంధనల ప్రకారం జరుగుతున్న మొదటి విచారణ ఇది.