ముంబై : కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కొద్ది నెలల కిందటే డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడితే ప్రముఖులు సహా పలువురి ప్రాణాలు కాపాడగలిగేవారమని బాంబే హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లలేని సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు చొరవ చూపలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణితో కూడిన బెంచ్ ప్రశ్నించింది.
75 ఏండ్లు పైబడిన వారికి డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 22న తాము ఈ దిశగా ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరింది. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ పై కేంద్రం ఇప్పటి వరకూ తన నిర్ణయం వెల్లడించలేదని పేర్కొంది. పలు దేశాలు ఇప్పటికే ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నాయని తెలిపింది. మే 19 లోగా ఈ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను అప్పటివరకూ కోర్టు వాయిదా వేసింది.