Supreme Court : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో గత ఏడాది చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. నిందితుడు మిహిర్ షా (Mihir Shah) వేసిన పిటిషన్పై దర్యాప్తు చేపట్టేందుకు నిరాకరించింది.
ఇలాంటి వాళ్లకు తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బైక్పై వెళ్తున్న దంపతులను నిందితుడు తన కారుతో అతివేగంగా ఢీకొట్టడమే కాకుండా, అక్కడి నుంచి పరారయ్యాడని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. చేసిన నేరానికి అతడు కొద్ది రోజులపాటు జైల్లోనే ఉండాలని ఆదేశించింది.
కాగా గత ఏడాది ముంబైలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దాంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. అనంతరం కారు మహిళపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కావేరి నక్వా (45) అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త గాయపడ్డారు.
ఇదిలావుంటే ప్రమాదం తర్వాత మిహిర్ కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ ఇవ్వాలని మిహిర్ ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ న్యాయస్థానం బెయిల్ను తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.