ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 4: కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గ్రామీణ ప్రజలకు చవకైన ధరల్లో కంటి చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడంతో కూడా ప్రజలు అంధత్వం బారిన పడకుండా కాపాడవచ్చునని చెప్పారు. కర్ణాటకలోని శ్రీ రామకృష్ణ సేవాశ్రమం రజతోత్సవం, శ్రీ శారదాదేవీ కంటి దవాఖానలో కొత్త బ్లాక్ను వెంకయ్యనాయుడు శనివారం వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచస్థాయి సదుపాయాలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రైవేట్ దవాఖానల భాగస్వామ్యం అవసరమన్నారు. నేత్రదానానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంధులకు చూపునివ్వడం ఓ అత్యుత్తమ చర్యగా అభివర్ణించారు. జాతీయ అంధత్వ సర్వే (2015-19) ప్రకారం దేశంలో సుమారు 68 లక్షల మంది ఏదో ఒక కంటికి కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారని చెప్పారు. వారిలో దాదాపు 10 లక్షల మంది పూర్తిగా చూపును కోల్పోయారని తెలిపారు.