న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దట్టంగా పొగమంచు కమ్మింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ 50 మీటర్ల కంటే దిగువకు పడిపోవడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా మారడం కూడా పొగమంచు దట్టంగా కమ్మడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఉదయం ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచీ) 315కు పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ ఏరియాల్లో AQI 309గా ఉన్నది. లోధి రోడ్ ఏరియాలో కాస్త తక్కువగా 301 ఉన్నది. మథుర రోడ్లో అత్యధికంగా 331 స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్టు టర్మినల్లో 332గా నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేనట్లు. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం. కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్నది.