న్యూఢిల్లీ, మార్చి 25 : పశ్చిమాసియాలో ఏర్పడ్డ యుద్ధ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుందా? అంటే అవునని అంటున్నారు అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం, బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్. యుద్ధ సంక్షోభం కారణంగా ఇప్పటికే చమురుకు కొరత ఏర్పడిందని, వాటి ధరలు కనుక 150 డాలర్లకు చేరితే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని ఆయన హెచ్చరించారు. భారీ చమురు ధరలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొంటుందని ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్ర స్థాయిలో జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే దానిపై ఇప్పుడు ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందన్నారు. యుద్ధం ముగిసి, ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఇరాన్ను ప్రపంచం ఆమోదిస్తే చమురు ధరలు యుద్ధం నాటి కంటే దిగువకు పడిపోతాయని, అలా కాకుండా యుద్ధం కొనసాగి చమురు ధర 100 డాలర్లను దాటి 150 డాలర్లకు చేరువగా సుదీర్ఘకాలం ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోవచ్చునని అయన తెలిపారు.
ఇరాన్పై యూఎస్-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడి పశ్చిమాసియాను అల్లకల్లోలం చేస్తుండగా, ఆ దాడి ప్రభావం ఇప్పటికే చమురు, గ్యాస్తో పాటు ఎరువులపై కూడా పడింది. అంటే దాని ప్రభావం పరోక్షంగా మన వంట ఇంటిని తాకనుంది. ఎరువుల రవాణాకు ఆటంకం ఇలాగే కొనసాగితే ఎరువుల కొరత, అధిక ధరల రూపంలో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు కలిగే అవకాశముందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జేనహ మేరీ పౌగమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడింట ఒక వంతు ఎరువులు గల్ఫ్ దేశాల నుంచి హొర్ముజ్ జలసంధి మీదుగా రవాణా అవుతున్నాయి. దీని మూసివేత కొనసాగితే యూరియా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఆధారిత దేశాల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎరువుల కొరత అంతగా లేనప్పటికీ దాని ప్రభావం వచ్చే ఏడాది పంటపై పడుతుంది. అలా కాకుండా ప్రపంచ దేశాలు ఎరువులు, ఆహార ధాన్యాలను నిల్వ చేయడం ప్రారంభిస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడుతుంది. అదే జరిగితే ఆహారాన్ని దిగుమతి చేసుకునే పేద దేశాలు మరింత దయనీయ పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
మన దేశంలో యూరియా ఉత్పత్తికి అవసరమైన ద్రవరూప సహజ వాయువు ఎల్ఎన్జీని భారత్ ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. అయితే ఖతార్లో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్ఠంభనతో ఆ దేశం నుంచి ఎల్ఎన్జీ సరఫరా ఆగిపోయింది. దీంతో ప్రధాన ఆహార ఎగుమతిదారులైన భారత్, థాయ్లాండ్, బ్రెజిల్ వంటి దేశాల్లోని కొన్ని యూరియా కంపెనీ ప్లాంట్లను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత యూరియా ధరలు కొండెక్కడం ప్రారంభించాయి. సరఫరా కొరత కారణంగా సుమారు వీటి ధరలు 25 శాతం పెరిగాయి. ఇప్పటికే చమురు ధరలు పెరుగుతున్నాయి. అది రైతుల రవాణా చార్జీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానికి తోడు ఎరువుల ధరలు కూడా పెరగడంతో రైతుల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. తద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధరలు రెండు శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇది కచ్చితంగా సామాన్యుడిపై భారంగా పరిగణించక తప్పదు.