గుణ: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై వేటగాళ్లు ఫైరింగ్ జరిపినట్లు గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. వేటగాళ్ల వద్ద గన్నులు ఉన్నాయని, మోటారుబైక్పై వచ్చిన ఆ వేటగాళ్లు.. పోలీసు టీమ్పై కాల్పులు జరిపినట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీసులు ఎదురుదాడి చేసినా.. వేటగాళ్లు అక్కడ నుంచి పారిపోయారు. ఈ దాడిలో ఎస్సై రాజ్కుమార్ జత్వా, హెడ్ కానిస్టేబుల్ సంత్ కుమార్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వాహనం నడుపుతున్న డ్రైవర్ కూడా ఈదాడిలో గాయపడ్డాడు. కృష్ణ జింకల కోసం కొందరు వేటగాళ్లు అడవికి వచ్చినట్లు సమాచారం రావడంతో అక్కడికి పోలీసులు వెళ్లారు. అటవీ ప్రాంతం నుంచి కృష్ణ జింకల శరీర భాగాలను పోలీసులు సేకరించారు. వేటగాళ్ల కాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు కోటి నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు సీఎం శివరాజ్ వెల్లడించారు.