న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారులు తమ షాపులను ఖాళీచేసి ఈ నెల 15లోగా వెళ్లాలని హెచ్చరిస్తూ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో పోస్టర్లు వెలిశాయి. ‘ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. మే 27న స్థానిక దుకాణదారుడైన ఉబెద్ఖాన్ (24), జితేంద్రశర్మ (23) ఓ బాలికను అపహరించేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత ముస్లింలకు ఇక్కడ చోటు లేదంటూ రైట్వింగ్ సంస్థలు ఆందోళనకు దిగాయి. బార్కోట్లో శనివారం ముస్లింల దుకాణాలు, ఇండ్లపై కొందరు దాడులకు దిగారు. దుకాణాలపై నల్లరంగుతో ముద్రలు కూడా వేశారు. అనంతరం పురోలా మార్కెట్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి.