న్యూఢిల్లీ, మే 16: రైతు నేత రాకేశ్ టికాయిత్ అధికార ప్రతినిధిగా ఉన్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) రెండుగా చీలిపోయింది. యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్, రాకేశ్ టికాయిత్ల వ్యవహారశైలిని తప్పు పడుతూ కొంత మంది రైతు నేతలు సంస్థ నుంచి బయటకు వచ్చి మరో యూనియన్ను ఏర్పాటు చేశారు. కొత్త యూనియన్కు బీకేయూ(అరాజ్నైతిక్) అని పేరు పెట్టారు. కొత్త యూనియన్కు రాజేంద్రసింగ్ చౌహాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టికాయిత్ సోదరుల నేతృత్వంలో యూనియన్ పొలిటికల్ సంస్థగా మారిందని ఆరోపించారు.
రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం బీకేయూ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. కానీ, టికాయిత్ ఇటీవల ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున ప్రచారం చేశారని గుర్తుచేశారు. అందుకే యూనియన్ నుంచి బయటకు వచ్చినట్టు వెల్లడించారు. బీకేయూ(అరాజ్నైతిక్) రైతుల కోసమే పనిచేస్తుందని, రాజకీయాల్లో జోక్యం చేసుకోబోదని పేర్కొన్నారు. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్ర సింగ్ టికాయిత్ వర్ధంతి అయిన ఆదివారం రోజునే బీకేయూ చీలిపోవడం గమనార్హం. కాగా, చీలిక వెనుకు యూపీ సర్కారు హస్తం ఉందని టికాయిత్ ఆరోపించారు.