Ritu Tawde : ముంబై (బృహన్ ముంబై కార్పొరేషన్-బీఎంసీ) మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే వర్గం)కు చెందిన సంజయ్ శంకర్ ఘాడి నామినేషన్ దాఖలు చేశారు. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి మహాయుతి కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ కూటమి మెజారిటీ స్థానాలు సంపాదించింది. అయితే, మేయర్ పదవి విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది.
తాజాగా కూటమి తరఫున ముంబై మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేయగా, డిప్యూటీ మేయర్ స్తానం కోసం శివసేన నేత సంజయ్ శంకర్ ఘాడీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 227 స్థానాలున్న బీఎంసీలో మహాయుతి కూటమి 118 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో బీజేపీ 89 సీట్లు, శివసేన (షిండే) 29 సీట్లు గెలుచుకుంది. మేయర్గా పోటీ పడుతున్న రితూ తావ్డే 132 వ వార్డు అయిన ఘట్కోపర్ నుంచి గెలుపొందారు. ఆమె ఇప్పటివరకు మూడుసార్లు కార్పొరేటర్గా గెలిచారు. రితూ గతంలో కాంగ్రెస్లో ఉండేవారు. 2012లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీఎంసీ దేశంలోనే అతిపెద్ద స్థానిక సంస్థ (కార్పొరేషన్). ఈ సంస్థ గత ఏడాది బడ్జెట్ రూ.74,450 కోట్లుగా ఉంది. బీఎంసీకి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడం విశేషం.
ఇక.. పాతికేళ్ల తర్వాత శివసేన ముంబై మేయర్ పదవి కోల్పోనుంది. 1997 నుంచి ఆ పార్టీయే మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటూ వచ్చింది. ఈసారి మాత్రం శివసేన (యూబీటీ) 65 స్తానాలు మాత్రమే గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఎమ్మెన్నెస్ 6 సీట్లు, ఎన్సీపీ (శరద్ పవార్) ఒక సీటు, కాంగ్రెస్ 24 సీట్లు, ఏఐఎంఐఎం 8 సీట్లు, ఎస్పీ రెండు సీట్లు గెలుచుకున్నాయి. అయితే, మహాయుతి కూటమిలోనే ఉన్నప్పటికీ అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ సొంతంగా బరిలోకి దిగింది. కేవలం 3 సీట్లే గెలుచుకుంది. ఈ మూడు సీట్లు కూడా ఇప్పుడు మహాయుతి కూటమిలో భాగంగానే ఉంటాయి.