ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయనకు మొత్తం 288 సభ్యుల్లో 145 మంది మద్దతు అవసరం. అయితే రాహుల్ నార్వేకర్కు 164 ఓట్లు వచ్చాయి. దీంతో సోమవారం అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో సీఎం ఏక్నాథ్ షిండే ఈజీగా గట్టెక్కుతారని తెలుస్తున్నది. మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రాహుల్ నార్వేకర్ గెలిచారు. మహావికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమికి చెందిన శివసేన అభ్యర్థి రాజన్ సాల్విపై ఆయన విజయం సాధించారు. రాజన్కు 106 ఓట్లు వచ్చాయి.
కాగా, మహారాష్ట్ర స్పీకర్గా ఎన్నికైన రాహుల్ నార్వేకర్ రాజకీయ కుటుంబానికి చెందినవారు. వృత్తిపరంగా న్యాయవాది. ఆయన తండ్రి సురేష్ నార్వేకర్ కౌన్సిలర్. 2019 ఎన్నికల్లో కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుఫున పోటీ చేసిన ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే రాహుల్ నార్వేకర్కు శివసేనతోపాటు ఎన్సీపీతో సంబంధాలున్నాయి. 2014లో శివసేనలో చేరిన ఆయన సేన యూత్ వింగ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తొలుత ఆయన శివసేన తరుఫున ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే ఆయనకు టికెట్ లభించలేదు.
ఎన్సీపీ ఎమ్మెల్సీ, మహారాష్ట్ర శాసన మండలి చైర్మన్, స్పీకర్ అయిన రాంరాజే నాయక్ నింబాల్కర్ అల్లుడు రాహుల్ నార్వేకర్. దీంతో ఆయన ఎన్సీపీలో చేరి మావల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాహుల్ నార్వేకర్ బీజేపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొలాబా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు.