కోల్కతా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత క్రికెట్ జట్టుతోపాటు దేశంలోని పలు సంస్థలను కాషాయీకరిస్తున్నదని (Saffron Colour) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) విమర్శించారు. భారత క్రికెట్ జట్టు (Indian Cricket team) సభ్యులు ఆరెంజ్ కలర్ జెర్సీ (Jerseys) ధరించి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారని చెప్పారు. అదేవిధంగా మెట్రో స్టేషన్లను (Metro Stations) కూడా భారతీయ జనతా పార్టీ (BJP) జెండా రంగులోకి మారుస్తున్నారని ఆరోపించారు. దేశం మొత్తాన్ని ఆరెంజ్ రంగులోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రపంచకప్లో మన జట్టు బాగా ఆడుతున్నదని, తప్పకుండా కప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం జట్టులోని సభ్యులు ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తున్నారని, వారిని చూస్తే గర్వంగా ఉందన్నారు. అయితే వారు ప్రస్తుతం కాషాయ రంగులో ఉన్న జెర్సీతో ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు. మెట్రో స్టేన్లను ఆ పార్టీ రంగులోకి మారుస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమ్మతం కాదన్నారు.
కేంద్రంలోని పాలకులు తమ విగ్రహాలను పెట్టుకోవడం పట్ల తనకేమీ అభ్యంతరం లేదన్నారు. కానీ ప్రతీదాన్ని కాషాయీకరిస్తున్నారని విమర్శించారు. అప్పుడెప్పుడో మాయావతి (Mayawati) తన విగ్రహాలను పెట్టుకోవడాన్ని తాను చూశానని, మళ్లీ చూడలేదన్నారు. ఇలాంటివి ఎప్పుడూ ఉపయోగపడవని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, అది వస్తుంది పోతుందని విమర్శించారు. దేశం ప్రజలదని, జనతా పార్టీ కాదని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.