బెంగళూర్ : హిందువులు తమ మత విశ్వాసాలను బేషరతుగా పాటించాలని బీజేపీ సీనియర్ నేత సీటీ రవి పిలుపు ఇచ్చారు. భారత్ను హిందూ రాజ్యంగా మలచడమే తమ పార్టీ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఎప్పటికీ హిందూ రాజ్యంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు పలు చర్యలు చేపట్టేదని, అయితే ఇప్పుడు హిందువులు ఏకమయ్యారని వారికి అవగతమైందని అన్నారు. దీంతో ఇప్పుడు వాళ్లు దుర్గా పూజ చేయడం, దేవాలయాల చుట్టూ తిరగడం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
మీరు హిందువులైతే ఎన్నికల కోసం కాకుండా తరచూ వీటిని పాటించాలని సూచించారు. హిందూ యువతీ యువకుల్లో మతం, సంప్రదాయాల పట్ల గౌరవభావం పాదుకొల్పాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల నేపధ్యంలో సీటీ రవి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మన పిల్లల్లో హిందూ మతం విశిష్టత, మన సంప్రదాయాలు, విలువలను బోధించాలని ఉత్తరాఖండ్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరెస్సెస్ చీఫ్ పేర్కొన్నారు.