కర్నాటకలో సంతోశ్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఇప్పుడు మంత్రి ఈశ్వరప్ప మెడుకు చుట్టుకుంది. మంత్రి ఈశ్వరప్ప తనను 40 శాతం కమీషన్ అడిగారని, అది ఇవ్వలేక.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప విషయంలో బీజేపీ అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదిరి చూస్తున్నారు. బుధవారం సాయంత్రానికి బీజేపీ అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మంత్రి ఈశ్వరప్పను పార్టీ నుంచి బహిష్కరిస్తారని జోరుగా ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇంతటి కీలక నిర్ణయాన్ని బీజేపీ బుధవారం సాయంత్రానికి అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. పార్టీ నుంచి ఆయనకు ఉద్వాసన పలకడం ఖాయమని కర్నాటక బీజేపీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.
తన మృతికి మంత్రి ఈశ్వరప్పే కారణమంటూ కాంట్రాక్టర్ సంతోశ్ పాటిల్ సూసైడ్ నోట్ రాశారు. మంత్రి ఈశ్వరప్ప తనను 40 శాతం కమీషన్ అడిగారని, అది కట్టలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కాంట్రాక్టర్ తన సూసైడ్ నోట్లో రాసుకున్నారు. ఈశ్వరప్పే తన మృతికి కారణమని, ఆయనను కచ్చితంగా శిక్షించాలని కోరారు. తన కోరికలన్నింటినీ చంపుకొని, ఆత్మహత్యకు ఒడిగడుతున్నానని, తన కుటుంబ యోగక్షేమాలు ప్రధాని, యడియూరప్ప, సీఎం చూసుకోవాలని ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టారు.
మంత్రిపై ఎఫ్ఐఆర్ : సీఎం బొమ్మై
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది వాస్తవమేని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అంతా సేకరించానని సీఎం పేర్కొన్నారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయని సీఎంను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఈశ్వరప్ప రాజీనామా గురించి తనకేమీ తెలియదన్నారు. ఈశ్వరప్ప తనతో నేరుగా మాట్లాడినప్పుడే ఈ అంశాలపై స్పష్టత వస్తుందని సీఎం బసవరాజ్ పేర్కొన్నారు.