న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అభిప్రాయపడ్డారు. 2019లో మాదిరిగా ఈసారి బీజేపీ భారీ సంఖ్యలో సీట్లు సాధించడం తేలిక కాదని, విపక్షాలు కలసికట్టుగా వ్యవహరించి ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపితే అధికార పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విపక్ష కూటమికి కాంగ్రెస్ ఇరుసులా ఉండాలా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. బీజేపీ తర్వాత దేశవ్యాప్తంగా ఉనికిని కలిగి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని, వాస్తవానికి కేరళ, తమిళనాడు లాంటి కొన్ని రాష్ర్టాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉన్నదని చెప్పారు. బీజేపీని గద్దె దించేందుకు విపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంటూ.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లనే బీజేపీ సునాయాసంగా గెలిచిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా విపక్షాలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.