న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకొన్నది. మేయర్ ఎన్నికల్లో తాము బరిలో లేమని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పుకొచ్చిన కమలం పార్టీ.. తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. షాలీమర్ బాగ్ కౌన్సిలర్ రేఖాగుప్తాను మేయర్ అభ్యర్థిగా, రామ్నగర్ కౌన్సిలర్ కమల్ బగ్రిను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు బీజేపీ మీడియా సెల్ హెడ్ హరీశ్ ఖురానా మంగళవారం వెల్లడించారు. నామినేషన్లకు చివరి రోజున బీజేపీ అభ్యర్థుల ప్రకటన చేయడం గమనార్హం. ఎంసీడీలో కీలకమైన స్టాండింగ్ కమిటీ పోస్టులకు కూడా ముగ్గురి పేర్లను బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ శాఖ ప్రకటన తర్వాత పార్టీ అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. జనవరి 6న మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకొనేందుకు తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ తన అభ్యర్థులను నిలబెట్టడంపై చర్చ నడుస్తున్నది. ‘ఆపరేషన్ కమలం’కు తెరతీస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.