న్యూఢిల్లీ, నవంబర్ 9: జీ20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ20 లోగోపై బీజేపీ గుర్తు ‘కమలం’ ఉండటంపై దుమారం రేగింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అధికార పార్టీ బీజేపీ ఈవిధంగా సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించాయి. ప్రధాని మోదీ, బీజేపీ తమను తాము ప్రమోట్ చేసుకొనేందుకు ఏ అవకాశాన్ని కూడా వదలరని ఎద్దేవా చేశాయి. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి స్వీకరించనున్నది.