అహ్మదాబాద్, నవంబర్ 7: వరుసగా ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం.. రెండు దశాబ్దాలకుపైగా తిరుగులేని అధికారం.. అయినా ఆ ప్రాంతంలో మాత్రం బీజేపీ ఆటలు సాగటం లేదు. అవును.. గుజరాత్ను ఏనాడో గుప్పిట పట్టిన బీజేపీకి అక్కడి తూర్పు ప్రాంతంలోని గిరిజనులు మాత్రం ఎప్పుడూ కర్రు కాల్చి వాత పెడుతూనే ఉన్నారు. ప్రధాని మోదీ చరిష్మాను వాడుకొని ఈసారైనా అక్కడ పాగా వేయాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది.
ఈసారీ ఎదురుగాలే..!
గుజరాత్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 89.17 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరు ఎక్కువగా తూర్పు ప్రాంతంలోని 14 జిల్లాల్లోని 48 తాలూకాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. వీరి ప్రాబల్యంలో 27 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నది. రాజకీయ పార్టీలకు ఉత్తరాన ఉన్న అంబాజీ నుంచి దక్షిణాన ఉన్న ఉమెర్గావ్ వరకు ప్రాంతాలు చాలా కీలకం. ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు 2002 నుంచి బీజేపీ ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కాలేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా.. ఈసారి కూడా ఇక్కడ ఆ పార్టీదే ఆధిపత్యం కొనసాగపోతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
ఓట్ల చీలికపై బీజేపీ ఆశలు
గుజరాత్లో ఈసారి కొత్తగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నది. దశాబ్దాలపాటు కాంగ్రెస్, బీజేపీలను మాత్రమే చూసిన ఓటర్లకు కొంగొత్త హామీలతో కొత్తదనం చూపిస్తున్నది. ప్రజాకర్షక సంక్షేమ పథకాలు అమలుచేస్తామని హామీలిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నది. దీంతో ఈ గిరిజన ప్రాంతంలో కూడా ఆ పార్టీకి మంచి అవకాశాలే ఉన్నాయని భావిస్తున్నారు. సరిగ్గా బీజేపీ కూడా అదే కోరుకొంటున్నది. ఈ ప్రాంతంలో ఆప్ బలపడితే చీలిపోయేది కాంగ్రెస్ ఓట్లేనని, తద్వారా తమకు లాభం కలుగుతుందని కమలం నేతలు అంచనా వేస్తున్నారు. 2017 ఎన్నికల్లో మొత్తం 27 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో 15 కాంగ్రెస్ గెలువగా, బీజేపీ 8 గెలిచింది. రెండుచోట్ల భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ), ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు.
తొలిసారి శరణార్థులకు ఓటు హక్కు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి శరణార్థులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన 1,032 మంది హిందువులకు గుజరాత్లో భారత పౌరసత్వం ఇచ్చారు. వీరంతా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారని అధికారులు తెలిపారు.