(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) ః ఇస్లామిక్ ఉగ్రవాదులకు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని విమర్శించే బీజేపీ రాష్ట్ర నాయకులకు మింగుడుపడని విషయమిది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పగా చెప్పుకునే గుజరాత్లో అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాదుల సంస్థ అల్ఖైదా స్థావరం బయటపడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగడం సంచలనంగా మారింది. అహ్మదాబాద్ కేంద్రంగా అల్ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు రెండు రోజుల కిందట బయటపడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని విమర్శించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరి గుజరాత్లో వెలుగు చూసిన అల్ఖైదా స్థావరానికి ఏమి సమాధానం చెబుతారో? చూడాలి. బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అల్ఖైదా ఉగ్రవాదులు అహ్మదాబాద్ కేంద్రంగా రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నట్టు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ చీఫ్ దీపన్ భద్రన్ వెల్లడించారు. ఈ ఉదంతంలో నలుగురిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. నకిలీ ఆధార్, పాన్ కార్డులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో నివాసం ఏర్పాటు చేసుకున్నారని వివరించారు.