లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది. స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా అనంతరం ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. అవరాత్ సింగ్ భదానా బీజేపీని వీడి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (RLD)లో చేరారు. ఈ విషయాన్ని ఆర్ఎల్డీ చీఫ్ జయంత్చౌదరి ట్విట్టర్ ద్వారా తెలిపారు. అవతార్ సింగ్ భదానా ముజఫర్నగర్ జిల్లాలోని మీర్పూర్ ఎమ్మెల్యే. 2017లో బీజేపీ టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు.
ఎన్నికల సమయంలో ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయలేదు. అయితే, సభ్యత్వాన్ని సైతం రద్దు చేయకపోవడంతో ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆర్ఎల్డీ పార్టీలో చేరక ముందు ఆయన బీజేపీ, కాంగ్రెస్లో కొనసాగారు. నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన మీరట్ నుంచి కూడా గెలుపొందారు. స్వామి ప్రసాద్ రాజీనామా తర్వాత నిన్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించి.. బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నది.