పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ను భారతీయ జనతాపార్టీ అవమానించింది. గోవాలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి జాబితా ప్రకటించిన బీజేపీ.. అందులో ఉత్పల్ పారికర్కు చోటు కల్పించలేదు. మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్నా అందులో ఉత్పల్ పారికర్ కోరుకున్న స్థానం లేదు.
దివంగత మనోహర్ పారికర్ గోవా రాజధాని పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి వరుసగా 25 ఏండ్లు ప్రాతినిధ్యం వహించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తన తండ్రి సొంత నియోజకవర్గమైన పనాజీ నుంచి తనకు టికెట్ ఇవ్వాలని ఉత్పల్ పారికర్ బీజేపీని కోరుతూ వచ్చారు.
అయితే, బీజేపీ అధిష్ఠానం ఉత్పల్ అభ్యర్థనను పట్టించుకోలేదు. ఇవాళ పనాజీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు పనాజీ టికెట్ ఇచ్చింది. అందుకు ప్రతిగా ఉత్పల్ పారికర్ రెండు వేరే స్థానాలను ఆఫర్ చేసింది. అయితే, బీజేపీ ఆఫర్ను ఉత్పల్ తిరస్కరించారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్పల్ పారికర్కు పనాజీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసింది.
ఉత్పల్ పారికర్కు అసెంబ్లీ టికెట్ నిరాకరించడం ద్వారా బీజేపీ యూజ్ అండ్ త్రో పాలసీని అవలంభించిందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్పల్ పట్ల బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని చూసి గోవా ప్రజలు చాలా బాధపడుతున్నారని చెప్పారు. తాను మనోహర్ పారికర్ను ఎప్పుడూ గౌరవిస్తానని, ఉత్పల్ పారికర్ను ఆప్లోకి ఆహ్వానిస్తున్నానని ట్వీట్ చేశారు.