Fadnavis | మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా పని చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కోరడం.. ఆ పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపినట్లు తెలుస్తున్నది. ఇటీవలి వరకు శివసేన సారధ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి చేపట్టిన `ఆపరేషన్ లోటస్` వ్యూహం వెనుక ఉన్న ఫడ్నవీస్.. హోదా తగ్గించడం పార్టీ శ్రేణులకు కష్టంగా ఉన్నట్లు సమాచారం.
గురువారం మధ్యాహ్నం వరకు షిండేను సీఎంగా ప్రకటించడంతో ఫడ్నవీస్.. క్యాబినెట్కు దూరంగా ఉంటారని భావించినట్లు బీజేపీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఫడ్నవీస్ భాగస్వామిగా ఉంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
దాని కొనసాగింపుగా కేంద్ర హోంమంత్రి అమిత్షా ట్వీట్ చేస్తూ.. పెద్ద మనస్సుతో.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వంలో భాగస్వామి కావడానికి ఫడ్నవీస్ అంగీకరించారని పేర్కొన్నారు. అర్ధగంట తర్వాత షిండే, ఫడ్నవీస్.. రాజ్భవన్కు వెళ్లి సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంటికెళుతున్నప్పుడు ఆయన ముఖం చిన్నబోయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నూతన సర్కార్కు దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యం వహించరని జీర్ణించుకోవడం కష్టసాధ్యంగా మారిందని దక్షిణ మధ్య ముంబైకి చెందిన బీజేపీ నేత ఒకరు తెలిపారు. జేపీ నడ్డా, అమిత్షా ట్వీట్లతో తాము విస్మయానికి గురయ్యామన్నారు. మహారాష్ట్రలో బీజేపీ సారధిగా ఉన్న ఫడ్నవీస్ పట్ల అనుచిత వైఖరిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని సమాచారం.